Wednesday, June 25, 2008

ఆంధ్రజ్యోతిపై అర్ధరాత్రి దొంగ దెబ్బ

ఇందిరమ్మ తన పదవి నిలిపుకోడానికి 1975 లో దేశం మీద అర్ధరాత్రి రుద్దిన ఎమర్జెన్‍సీ 33వ వర్ధంతి జరుపుకోబోయే శుభతరుణంలో వైస్ తన ప్రియతమ నాయకురాలి అడుగుజాడలలో అటువంటి ఒక హీనమైన చర్యకు పాల్పడ్డారు. ఆనాడు ఆవిడ తన అడుగులకు మడుగులొత్తని పత్రికల పీకనొక్కేరు. ఈ నాడు అదే దారిలో నడుస్తూ మన వైస్ ఒక కుంటి సాకుతో ఆంధ్రజ్యోతి సంపాదకుడని, ఇద్దరు రిపోర్టర్లని రాత్రిపూట అరెస్టు చేయించాడు.రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి రాత్రిని ఆవిష్కరించాడు. తన కుళ్ళు బుద్ధి మరొసారి బైట పెట్టుకున్నాడు. ఆయన గులాములు పోలీసులు "ఇందులో రాజకీయమేమీ లెదు అంతా చట్ట ప్రకారమే చేసాం" అని జోకులేస్తున్నా ఇటువంటి చర్య పెద్దాయన ఆశీర్వచనం లేందే ఎవరూ సాహసించరన్నది సుస్పష్టం.తనకు సరిపడని పత్రికలను ఏదో ఒక రకంగా తన దారికి తెచ్చుకుందుకు మొదటినుండీ ప్రయత్నిస్తున్న ఈ కాంగ్రెస్ (వి)నాయకుడు నాడు "ఈ నాడు" నేడు ఆంధ్రజ్యోతి పత్రిలపై కాలు దువ్వుతున్నాడు. అందులో భాగంగానే ఈ అరెస్టులు జరిగాయి. లేకపోతే "దొంగ వెళ్ళిన ఆర్నెల్లకు కుక్క భౌ అని ఆర్చినట్టు" అంధ్రజ్యోతి ఉద్యోగులు తన పోస్టర్లను కాలుతో తొక్కి, చెప్పులతో కొట్టి అవమానపరిచారంటూ వారిని అట్రాసిటి చట్టం కింద అరెస్ట్ చేయాలని మందకృష్ణ కేసు నమోదు చేసిన నెల తరువాత రాత్రి ఎడిషన్ తయారయ్యే సమయంలో వచ్చి పత్రికా సంపాదకుని అరెస్ట్ చేయడమేమిటి? అధికారంలో ఉన్న రాజకీయనాయకులకు తొత్తులుగా వ్యవహరించే పోలీసులకు ఇన్నాళ్ళ తర్వాత తెలివి రావడనికి కారణం ఈ మందకృష్ణుడు పోలీసుల చుట్టూ తిరుగుతూ ఆంధ్రజ్యోతి పైన చర్య తీసుకోవాలని పట్టుపట్టడం ఇదే అదను తమ పగతీర్చుకోవచ్చని ప్రభుత్వం భావించడం. తమాషా ఏమిటంటే, ముందర ఆంధ్రజ్యోతి ఆఫీసుపై దాడి చేసి విధ్వంసాన్ని సృష్టించిన వాళ్ళను, వెనుక ఉండి దానిని నడిపిన మందకృష్ణను వదిలేసారు, నీతులు వళ్ళిస్తున్న ఈ పోలీసు అధికారులు.
అట్రాసిటీ చట్టాన్ని ఇలాంటి కుంటి సాకులతో రాజకీయ ప్రయోజనాలకు వాడటం చాలా ప్రమాదకరమైన చర్య. "మాకు చట్టం ఉంది, పోలీసులు మాచుట్టాలు" అనుకొని ఇష్టారాజ్యంగా దుష్ట కార్యాలను తలపెడితే ఎవరూ హర్షించరు. దెబ్బ తినక తప్పదు. ఈ విషయాన్ని ఈ కులాలకు నాయకులమని విర్రవీగుతున్న వాళ్ళు గుర్తిస్తే వారికే మంచిది.

0 వ్యాఖ్యలు: