Friday, June 6, 2008

పెట్రో ధరల పెంపు - అందులో రాజకీయాలు

ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గేసు ధరలను విపరితంగా పెంచేసింది. పాపం మన్ మోహన్ సింగ్ గారు కళ్ళ నీళ్ళ పర్యంతం అయి జాతినుద్దేశించి చావు కబురు చల్లగా చెప్పేరు " మీరు ఈ భారాన్ని మొయ్యక తప్పదు" అని. గత 2 నెలలుగా జరుగుతున్న భాగోతం ప్రజలముందుకు వచ్చేసింది. చిద్విలాసుడు చిదంబరం విజయహాసం చేసాడు. కేంద్రం పన్నులు తగ్గించేదిలేదు అని లుంగీ ఎగ్గట్టి మరీ చెప్పేసాడు.తన వాక్పటిమతో అధినేత్రి నోరు మూసేసాడు. పాపం ఆమె మాత్రం ఏమి చేస్తుంది. ఆ విషయాలన్నీ అర్ధం చేసుకొనే మేధా లేదు, ఓపికా లేదు. అన్నీ తెలిసినా, ప్రధాన మంత్రి గారు ఏమీ చెయ్యలేని పరిస్తితి. వెరసి ప్రజల నెత్తిన శఠగోపం.

ఇప్పుడే అసలు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అధినేత్రి సోనియా కాంగ్రెసు పాలనలో ఉన్న ముఖ్యమంత్రులకు "మీరు వేస్తున్న రాష్ట్ర సుంకాలను తగ్గించి ప్రజల మెప్పుపొందండని" హుకుం జారీచేసారు- . రాబోయే రాష్ట్రాల ఎన్నికలలో తమకి ఎదురుదెబ్బ తగలకుండా ఈ చర్యలు ఉపకరిస్తాయని కాంగ్రెస్ ఆశ. వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రిగారు ఉగులాడుతున్న తన పీఠం, రాబొయే ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని వంటగేస్‌పై పన్నులు తగ్గించి అదనపు భారం 10 రుపాయలే ఉండేటట్టు చూస్తామన్నారు. మన ముఖ్యమంత్రిగారైతే ( వీరు కొట్టమంటే నరికే రకం కదా)మొత్తం భారాన్ని తామే భరించి వంట గేస్‌పై అసలు పైసా కూడా పెరగనియ్యమన్నారు. దీనికి ఆడపడుచుల సెంటిమెంటు కూడా జతచేసారు. ఇదంతా చూసేక చేసేదిలేక కమ్యూనిష్టులు,భాజపా కూడా తమ వారిని పన్నులు తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించ మన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే ప్రియురాలి ప్రేమను పొందటానికి హీరో సినిమాల్లో తరచుచేసే ఫీటు గుర్తుకొస్తోంది. ముందు తను నియమించిన రౌడీలు హేరొయిన్ని ఎదుర్కుంటారు. తరవాత హీరోగారు వచ్చి హిరొయిన్ని రక్షిస్తారు. కొంచెం అటూ ఇటుగా ఇదీ అదే తంతు.

1 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar said...

అయ్యా పద్మనాభం గారూ బాగా రాసారు. ఈ విషయంపై ఈ క్రింది లంకెను చూడగలరు.
http://parnashaala.blogspot.com/2008/06/blog-post.html