Monday, June 9, 2008

ఆడలేక మద్దెలోడు

జలయజ్ఞం పేరుతో ఎడాపెడా సొమ్ముచేసుకుంటున్న వైఎస్ ప్రభుత్వం ఆ పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీనికి తాజా ఉదాహరణ దేవాదుల ప్రాజక్టు పైపులైను లీకేజీలు. ఒకసారి, ఒకచోట కాదు, అనేకసార్లు అనేకచోట్ల ట్రయల్‍రన్‍లో లీకేజీలు సంభవించేయి . వీటి వల్ల నీళ్ళు పంట పొలాలను తడపటానికి బదులు దగ్గరలోఉన్న పొలాలను నాశనం చేస్తున్నాయి. మొన్నటికిమొన్న పాలంపేట వద్ద ఎయిర్‍వాల్వ్ లీకేజీ వలన నీళ్ళు ఆకాశంలోకి ఎగజిమ్మేయి . అధికారుల నిర్లక్ష్యం, పనులలో నాణ్యతాలొపం వలన ముందుముందు ఈ ప్రాజక్టు పనితీరు ఎలాఉండబోతోందో రుచి చూపించాయి.

ఇది ఇలా సాగుతూవుంటే మంత్రివర్యులు పొన్నాలవారి వ్యాఖ్యానం ఇంకా దారుణం. దారుణమే కాదు, నిర్లక్ష్యానికి నిదర్శనం. " ఈ లీకేజీలు ఇంకా , ఇంకా బయటపడతాయి. ట్రయల్‍రన్ అంటేనే లోపాలను గుర్తించటం, మరోసారి రాకుండా చూడటం. ప్రాజక్ట్ నిర్మాణమై ప్రభుత్వానికి అప్పచెప్పాక కూడా రెండు సంవత్సరాలదాకా భాధ్యత కాంట్రాక్టర్లదే " అన్నారు సదరు మంత్రివర్యులు. అంటే కళ్ళుమూసుకొని ముందు పనికానిచ్చేయడం. తర్వాత వచ్చే లీకేజీలను పూడ్చుకోవడం. అంతేగాని ఇన్నిసార్లు ఇలా లీకేజీలు రావడం పనిలో లోపాన్ని సూచిస్తుందన్న కనీస ఇంగిత జ్ఞానం కలగదు.ఈ ప్రభుత్వంలో ఎవరూ దేనికీ భాధ్యత వహించరు. అంతా సవ్యంగా ఉంటే అది మా గొప్పే అని కాలరు ఎగరేసుకొని తిరుగుతారు. తప్పు జరిగితే దాని భాధ్యత అధికార్ల మీదికి నెట్టేస్తారు. అవును మరి వాళ్ళ నైజం ఎక్కడికి ఫోతుంది. డబ్బుదండుకోవడంలో ఉన్న ఉత్సాహం తరవాత ఉండదు.
ఇంతకీ దీని కొసమెరుపు - పొన్నాలవారు లీకేజీలకు కారణం ప్రజలే అనడం.

1 వ్యాఖ్యలు:

చైతన్య.ఎస్ said...

చాల మంచి విషయం ప్రస్థావించారు కాని అందరు దీని గురించి ఆలోచించాలి కదా!!!