Monday, August 1, 2011

తెలుగు పాటలు

anuvugani.mp3

Monday, November 23, 2009

హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు స్టాలు


హైదరాబాదు పుస్తక ప్రదర్శన డిసంబరు నెల 17 నుండి 27 వరకు నెక్లసు రోడ్డులోని పీపుల్స్ ప్లాజా లో జరుగుతుంది.
క్రిందటి సంవత్సరం లాగానే e-తెలుగు ఒక స్టాలును నిర్వహించాలని తలపెట్టింది.
మామూలు రోజుల్లో మద్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు,శని, ఆది వారాలలో మద్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు స్టాలు తెరచి ఉంటుంది.
స్టాలును విజయవంతంగా నడుపుటకు చాలా మంది వాలంటీర్ల అవసరం ఉంది.
తమ సేవలను అందివ్వగల తెలుగు అభిమానులు క్రింది వివరాలను ఇ-మెయిలు ద్వారా గాని
టెలిఫోను ద్వారా గాని తెలియపరచమని కోరుతున్నాము.

పేరు:
టెలిఫోను నంబరు:
ఇమెయిలు చిరునామా:
ఏ తేదీలలో ఏ సమయంలో స్టాలులో ఉండగలరో ఆ వివరాలు:

మీ అందరి సహాయ సహకారాలను ఆకాంక్షిస్తూ
- దూర్వాసుల పద్మనాభం
అద్యక్షుడు, e-తెలుగు
email: padmanabhamdurvasula@google.com

Telephones: 9989691606
040-27002787

Monday, December 8, 2008

తెలుగు భాషాభిమానులం - ఆరంభశూరులం!

"తెలుగు భాషని తెలుగు వాళ్ళే మాట్లాడటం లేదు. అలా మాట్లాడటానికి తెలుగు వాళ్ళే సిగ్గు పడుతున్నారు. మమ్మీ, డాడీ సంస్కృతి వచ్చి తెలుగుని తుడిఛిపెడుతోంది" అంటూ ఎందరో తెలుగు భాషాభిమానులు తెలుగు బ్లాగులలోనూ, తెలుగు గుంపులలోనూ ప్రతి రోజూ ఎన్నో పేజీలను నింపేస్తునారు. వేరే భాషల వాళ్ళు వాళ్ళ భాషలను ఎలా ప్రొత్సహిస్తున్నారో చెప్తున్నారు. ఈ-తెలుగు (etelugu.org) లో "తెలుగుని నిలుపుట" గురించి జరిగిన చర్చలో చాలా చాలా చెప్పేరు. కొంతమంది కొన్ని సుచనలూ చేసేరు. కాని విచిత్రమేమిటంటే, మనం ఈ విషయంలో కార్యాచరణకు పూనుకొనేందుకు ఉద్యుక్తులవుదాం, రండి ఒక చోట కూర్చొని ముఖాముఖి చర్చించి నిర్ణయాలను తీసుకుందాం అంటే ఏదో ఒక సాకుతో ముఖం చాటేస్తారు. ప్రతీ నెలా తప్పకుండా ఈ-తెలుగు (తెలుగు బ్లాగర్ల) సమావేశాలు జరుగుతున్నాయి. కాని పైన ఉదహరించిన పెద్దలు ఎంతమంది ముందుకు వచ్చేరు? సమావేశాలకు వచ్చి చర్చించేరు? తెలుగు భాష పైన అభిమానం ఇంతేనా? ఇలా అంటే కటువుగా అనిపించవచ్చు. కాని ఇది నూటికి నూరు పాళ్ళు నిజం.

ఊరకనే అభిమానం, అభిమానం అంటూ గొంతు చించుకుంటే ఏమి ప్రయోజనం? బ్లాగులలో వ్రాతలతోనూ, ఒకరినొకరు పొగుడుకోవటంతోనూ సరిపెట్టుకుంటే ఎలా? వ్రాయాలా, రాయాలా అన్న చర్చ ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యం కాదు. అసలు తెలుగు భాష ఉనికే ప్రశ్నార్ధకం అయినప్పుడు.

వేరే ప్రదేశాలలో ఉన్న వారిని ప్రక్కకు పెడితే హైదరాబాదులోనే ఉంటూ ఈ-తెలుగు (బ్లాగర్ల)సమావేశాలలో ఉత్సాహం చూపినది ఎందరు? మీకందరికీ తెలుసు. ఇది ఏదో ఒకరిద్దరి సమస్య కాదు.కాని బ్లాగులలోనూ, గుంపులలోనూ కబుర్లు చెప్పటంతో సరిపెట్టటం ఎంతవరకూ సమంజసం? పైగా ఉచిత సలహాలతో సరిపెడుతున్నారు.ఆంటే మనది ఆవేశం మాత్రమే అన్నమాట. అదే తెలుగు వాళ్ళకు పుట్టుకతో వచ్చిన బుద్ధా?

నాదొకటే కోరిక. వచ్చే 14వ తేదీన 3 గంటలకు, హైదరాబాదు యూసఫుగూడాలోని కృష్ణకాంత్ పార్కులో జరిగే సమావేశానికి రండి. మీ సూచనలకు కార్యరూపం ఇవ్వండి.వివరాలకు ఇక్కడ చూడండి
పై మాటలు మీకు కోపం తెప్పిస్తే అది నామీద చూపండి. అంతేకాని తెలుగు భాషని బ్రతకనీయండి.అందరం కలిసి భాషని నిలుపుదాం
.

Tuesday, November 25, 2008

తెలుగెందుకు?

తెలుగెందుకు?
ఇది మనలో చాలామందికి వస్తున్న సందేహం. ఆచార్య ఆర్వీయస్. సుందరం మైసూరు విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు, విపుల, ఆగస్టు 2007 సంచికలో దీని గురించి వ్రాసిన వ్యాసం లో చర్చించారు. దాని పూర్తి పాఠం ఇది:

ఆంధ్రప్రదేశ్ లో పాలకుల దగ్గర్నుంచి, అధికారుల దగ్గర్నుంచి, సామాన్య మధ్యతరగతి ప్రజల వరకు అడిగే ప్రశ్న ‘తెలుగెందుకు’ అని. ప్రపంచీకరణ సందర్భంలో, ప్రపంచమంతా ఒక్క గ్రామమైపోతున్న తరుణంలో, అంతర్జాలం (ఇంటర్నెట్) యువతపై పెత్తనం చలాయిస్తున్న సమయంలో తెలుగును పట్టుకొని వేళ్ళాడడం అసమంజసమని కొందరి అభిప్రాయం. ఉద్యోగావకాశాల కోసం, సాంకేతికవిద్యలను అభ్యసించటం కోసం, పర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్ళటం కోసం ఇంగ్లీషు చదవక తప్పదని వీరు వాదిస్తుంటారు. ఇవన్నీ మామూలు మనిషికి నిజమే అనిపిస్తాయి. పిల్లల భవిష్యత్తుని అడ్డుకోవటం తగదనీ అనిపిస్తుంది. శ్రీమంతులు, విద్యాధికులు, ఉన్నత వర్గాలవారూ ఎలాగూ తమ పిల్లల్ని ఇంగ్లీషు మాధ్యమంలో, ప్రయివేటు పాఠశాలల్లో చదివిస్తారు కాబట్టి తెలుగు కావాలనటం కేవలం బడుగు వర్గాలకే అన్వయిస్తుందని అనేవారూ ఉన్నారు. ఇదీ నిజమే. ఈ అన్నిటినీ ఆలోచించే ‘తెలుగెందుకు’ అన్నదానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.నేను ఆంధ్రప్రదేశ్ వెలుపలికి వచ్చి సరిగ్గా నలభై అయిదు ఏళ్ళయింది. నిజానికి నాకు తెలుగు అవసరం లేదు. ‘ఆంధ్రప్రదేశ్ బయట ఉన్నాడు కాబట్టే ఇతను ఎప్పుడూ తెలుగు, తెలుగు అంటుంటాడు’ అని కూడా కొందరు నన్ను ఎద్దేవా చేశారు. ‘నువ్వెక్కడో మైసూరులో ఉన్నావు. నీకు తెలుగు ప్రాచీన భాష అయితే ఏంటి? కాకపోతే ఏంటి? నీ పని నువ్వు చేసుకుని ఊరకుండరాదా’ అని నన్ను ఒక ప్రముఖ భాషాశాస్త్రవేత్త చీవాట్లు కూడా పెట్టారు. అయినా నేను తెలుగు గురించి మాట్లాడటం మానలేదు, మానను కూడా. ఎందుకంటే ప్రపంచంలో తెలుగుభాషకు దక్కాల్సిన గౌరవాన్విత స్థానం దక్కలేదు. తెలుగు భాషకుండే అర్హతలను బట్టి దానికి ఇంకా ఎంతో ఉన్నతస్థానం దొరకాల్సింది. కాని మన పాలకులకు తెలుగుభాష ఔన్నత్యాన్ని గురించిన అవగాహన లేకపోవటం వల్ల భాషా సంస్కృతుల పట్లగాని, వాటిని కలిగిన ప్రజల పట్లగాని వారికి ఏ మాత్రం గౌరవం లేకపోవటం వల్ల తెలుగుకు ఈ దుస్థితి పట్టింది.

ఇంగ్లండులోనే ఇంగ్లిష్!

ప్రపంచంలో ఒక్క ఇంగ్లీషు భాష మాత్రమే ఉందనుకోవటం మన మూర్ఖత్వం. ప్రపంచంలో అందరూ ఇంగ్లీషు వల్లనే అభ్యున్నతి సాధిస్తున్నారని భావించటం ఇంకా మూర్ఖత్వం. వీళ్లకు ప్రపంచమంటే అమెరికా మాత్రమే. అమెరికా పాలకులు ఏ తాళం వేస్తే దానికి గంతులెయ్యటం ఒక్కటే వీళ్లకి తెలిసింది. ఇంగ్లండులో తప్ప మరే ఐరోపా దేశంలోనూ ఇంగ్లీషు చదవరు. ఫ్రెంచి, జర్మను, స్విస్, ఫిన్నిష్, ఐరిష్ లాంటి భాషలే అయా దేశాల అధికార భాషలు. స్పానిష్, జపనీస్, రష్యన్, చైనీస్ భాషల వాళ్లు కూడా సాంకేతిక విద్యతోసహా వాళ్ల భాషలోనే చదువుతారు. భారతదేశం నుంచి అక్కడికి చదువుకోసం వెళ్లేవాళ్లు ఆ భాషల్ని నేర్చుకుంటారు.
మనుషులు బతకటానికి చదువొక్కటే చాలదు. పరిపాలన అంటే చదువు మాత్రమే కాదు. ప్రజలకు తెలియాల్సినవి, ప్రజలు అనుసరించాల్సినవి వందల విషయాలున్నాయి. కోట్ల మంది ప్రజలున్నప్పుడు ఆ ప్రజలు మాట్లాడే భాషలోనే వ్యవహారమంతా జరగాలి. అప్పుడే పరిపాలన సార్థకమవుతుంది. ఈ విషయాన్ని సి.పి.బ్రౌన్ లాంటి ఇంగ్లీషు పాలకులు కూడా అర్థం చేసుకున్నారు. కాని మనవాళ్లనుకొనే ఈ పాలకులకు మాత్రం అర్థం కావటంలేదు.

బోగస్ విద్యా విధానం

మన మాతృభాషకాని, మనకు అర్థంకాని సంస్కృతం, ఫ్రెంచి లాంటి భాషల్ని విద్యావిధానంలో భాగంగా చేసి వాటిని చదవకున్నా 90-100 మార్కులు వేసి, మా పిల్లలు తెలివిగలవాళ్లని చెప్పే బోగస్ విద్యావిధానం ప్రపం చంలో మరెక్కడయినా ఉందా? ఇంత ప్రాథమిక విషయమైనా అర్థంకాని ఈ విద్యావేత్తల్ని, అధికారుల్ని, పాలకుల్ని ఏమని పిలవాలి? ప్రపంచంలో 15 కోట్ల మంది మాట్లాడే ఒక భాషని ఇంతగా అవమానపరచటం ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? తెలుగువాడు ప్రతి ఒక్కడూ సిగ్గుతో తలవంచుకోనక్కర లేదా?
‘తెలుగు సాహిత్యం చదివితే ఒరిగేదేముంది’ అని ప్రశ్నించే ప్రబుద్ధులున్నారు. నిజమే. షేక్ స్పియర్ ని, మిల్టన్ ని, బెర్నార్డ్ షాని, రవీంద్రుడ్ని, ప్రేమ్ చంద్ ని చదివితే మనిషవుతాడు కాని నన్నయని, తిక్కనని, వేమనని, గురజాడని, శ్రీశ్రీని చదివితే లాభమేముంది? మనిషికి కావలసింది సాంకేతిక విద్య మాత్రమే. భౌతిక లాభాలు మాత్రమే అని భావించే వాళ్లుండబట్టే మన సమాజం రోజురోజుకీ దిగజారిపోతోంది. మానవ సంబంధాలు నాశనమై పోతున్నాయి.
మనిషిని కాపాడలేని విద్య, భౌతిక అవసరాలు, ఉద్యోగాలు ఏంచేసుకోవడానికి? ఏ విద్య చదివినా దానితోబాటు మానవతాగుణాల్ని కాపాడుకునేట్లు చేయాలంటే భాష, సంస్కృతి, సాహిత్యం అవసరమే. ఇది గుర్తించలేనప్పుడు మన విద్యావిధానమంతా వ్యర్థమే అవుతుంది.

ప్రపంచ స్థాయి భాష

ఇన్ని చెప్పిన తర్వాత ‘తెలుగెందుకు’ అనే ప్రశ్నకే మళ్ళీ వచ్చి దానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంది.
1. తెలుగు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా మాట్లాడే భాష. అక్కడ ఏడున్నర కోట్లమంది తెలుగు మాట్లాడుతుంటే అదే సంఖ్యతో ఇతర ప్రాంతాలలో తెలుగు మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఇంతమంది మాట్లాడే భాషలు ఐదారుకు మించిలేవు. అందువల్ల ఈ భాషని ప్రపంచస్థాయి భాషగా గుర్తించి దానికి తగిన స్థానాన్ని సంపాదించటం మన కర్తవ్యం.
2. భారతదేశంలో అనుసంధాన భాషగా హిందీని గుర్తించాం. నిజానికి హిందీ ఎక్కువమందికి అర్థమయ్యే భాష అనడం సమంజసం. హిందీ తెలిసిన వారిలో చాలామంది మాతృభాష వేరే ఉంటుంది. కాని తెలుగు విషయం అలా కాదు. తెలుగు మాట్లాడేవారే ఈ దేశంలో పదిహేను కోట్లమంది ఉన్నారు. అలాంటప్పుడు ఆ భాషకి జాతీయస్థాయిలో అధికార భాషగా స్థానం దక్కాలి. మన దురదృష్టం ఏమిటంటే పార్లమెంటులో తెలుగులో మాట్లాడితే దాన్ని అనువాదంచేసే దిక్కుకూడా లేదు. ఇలాంటి పరిస్థితిని గంభీరంగా పరిగణించే ప్రజాప్రతినిధులు లేకపోవటం మన దురదృష్టం.
3. మాతృభాషలో విద్య నేర్చుకుంటే చక్కగా అవగాహన అవుతుందని ఐక్యరాజ్య సమితితో సహా ఎంతోమంది నిపుణులు చెప్పారు. అయితే ఒకటో తరగతి నుంచే ఇంగ్లీషును ఇంజెక్ట్ చేస్తే మన పిల్లలు బాగుపడతారనుకునే అజ్ఞానంలో మనమున్నాం. కనీసం ఉన్నత పాఠశాలవరకైనా తెలుగులో చదువుకొని, తర్వాత తెలుగు వాడకాన్ని తెలుసుకునేలా చదివితే అలాంటివారి వల్ల తెలుగు వారికి ఉపయోగముంటుంది. అంతేకాని తెలుగువారందరినీ విదేశాలకు ఎగుమతిచేసి తెలుగువారికి మాత్రం ఏమీ మిగల్చకూడదనుకునే విద్యావేత్తలను ఏమనాలో అర్థంకావటంలేదు. ఇంగ్లీషు నేర్చుకోవటం, ఉద్యోగాలు సంపాదించటం వేరు, ఇంగ్లీషులోనే నేర్చుకోవటం వేరు. ఇంగ్లీషు నేర్చుకోవద్దని ఎవరన్నారు? బాగా నేర్చుకోండి. కాని తెలుగు వారి కోసం తెలుగును నేర్చుకోండి, తెలుగును తెలుసుకోండి
4. ‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు’ అన్న శ్రీ కృష్ణదేవరాయలకు ఉన్నపాటి పరిజ్ఞానం ఇన్ని వందలఏళ్ల తరువాత కూడా మన పాలకులకు లేదంటే మనమేమనుకోవాలి? దేశంలో ఉండేది తెలుగు వాళ్ళయినప్పుడు వాళ్లకు తెలుగులోనే చెప్పాలి, పరిపాలించాలి, విద్య నేర్పించాలి అన్నది ప్రాథమిక సూత్రం. అంతేకాదు ఏవిధంగా చూసినా తెలుగుకు సామర్థ్యం ఉన్నది అన్న విషయం గమనించాలి. భాషలో అక్షరాలున్నాయి, పదాలున్నాయి, ఏ భావాన్నయినా వ్యక్తం చేసే సామర్థ్యం ఉంది, ఎలాంటి విషయాన్నయినా ఇముడ్చుకునే శక్తి ఉంది - అలాంటప్పుడు ఆ భాషను సమర్థంగా ఉపయోగించుకోవలసిన కర్తవ్యం మనమీదుంది.
5. ప్రపంచంలో అప్పటికప్పుడు జ్ఞానం వృద్ధి అవుతుంది కదా? మరి, దాన్ని తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి అని ప్రశ్నించవచ్చు. ఇది తెలుగువారి సమస్యకాదు. ప్రపంచంలో జ్ఞానమంతా ఇంగ్లీషులో రాదన్నది ముందు తెలుసుకోవాలి. ఎంతోమంది మేధావులు, సాహితీవేత్తలు, విజ్ఞానులు, తత్వవేత్తలు జర్మన్ లో, ఫ్రెంచ్ లో, స్పానిష్ లో తమ జ్ఞానాన్ని వెలువరిస్తారు. అది ఎప్పుటికప్పుడు ఇంగ్లీషులోకి వస్తుంది. అలాంటి సౌకర్యాన్ని తెలుగువారికి కూడా కలుగజెయ్యాలి. అప్పుడే తెలుగు కూడా అభివృద్ధి చెందుతుంది. విస్తృత ప్రాతిపదిక మీద అనువాద అకాడమీ ఒకటి ఏర్పడాలి. ప్రతి ఒక్క విషయమూ వెంటనే తెలుగులో వెలువడేలా చెయ్యాలి. మనవారు తెలుగులో విద్య, విద్యాబోధన, పరిశోధన, పరిపాలన, ముఖ్యంగా ఆలోచన, అభివ్యక్తి జరిపేలా చేసినప్పుడు మనవారు ప్రపంచస్థాయిలో అభివృద్ధి చెందడానికి అవకాశముంటుంది.

Sunday, October 26, 2008

అభినవ నరకాసురులు

ఆ నాడు దివ్య వరాలను పొందిన నరకాసురుడు లోక కంటకుడై ప్రజలను బాధ పెట్టేడు. చివరకు శ్రీ కృష్ణుని దయ వలన నరకాసుర వధ జరిగి ప్రజలు ఊపిరి పీల్చుకొన్నారు. కాని ఇది కలియుగం. ఈ అభినవ నరకాసురుల భరతం ఎవరు పడతారు? వీళ్ళంతా ప్రజాప్రభుత్వ ముసుగులో దేశాన్ని దోచుకుంటున్న దోపిడీ దొంగలు. ఫూర్వం రాజులు యుద్ధాలు చేసి వేరే రాజుల రాజ్యాలను ఆక్రమించే వారు. కాని ఈ ముసుగు దొంగలు ప్రజల భూములనే ఆక్రమిస్తున్న ఘనులు. చేనే కంచ మెయ్యడమంటే ఇదే. ఆనాడు ఋషులు మోక్షం కోసం, ప్రజాహితం కోసం యజ్ఞాలు చేస్తే, ఈ నాడు పాలకులు తమ ఆస్తులను పెంచుకోటానికి వేల కోట్లతో ప్రజా ధనంతో ధన యజ్ఞాలను చేస్తున్నారు. ఇప్పటికే నడ్డి విరిగి బాధలపాలైన మధ్యతరగతి, బీద ప్రజలను ఈ నరకాసురుల బారినుండి కాపాడేదెవరు?

ఈ కార్యక్రమానికి దివినుండి ఏ దేవుడూ ఈ భువికి రాడు. ప్రజలే పూనుకోవాలి. కాని ప్రస్తుత పరిస్థితులలో ప్రజలకు ఇది సాధ్యమయే పని కాదు, కారణం, దారుణంగా వరుస మానభంగాలకు లోనైన ప్రజాస్వ్యామ్య వ్యవస్థ, ఓటు హక్కుని దుర్వినియోగం చేసిన, అసలే ఓటు హక్కుని వాడుకోని ప్రజలు. ఓటర్ల లిస్టులనుకూడా సరిగా తయారుచేయలేని నిర్వీర్యమైన ఎన్నికల సంఘం.

అంటే ఈ భూబకాసుర నరకాసురులను అంతమొందించాలంటే, చిన్న బకాసురులను ప్రజలు ఆశ్రయించక తప్పదు. బలవంతమైన సర్పం కూడా చలిచీమల బారిన పడి నశించక తప్పదు అన్నట్టు చిన్నాచితక రాజకీయ పార్టీలు ఉమ్మడి దాడి చేసి విషసర్పాన్ని అంతమొందించాలి. ఈ చిన్న పార్టీలనబడే రాజకీయ చలిచీమలు కూడా కుడతాయి. కాని ప్రస్తుతానికి ఏం చేస్తాం తప్పదు మరి.

అయితే ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఎవరి దారి వారివన్నట్టు వ్యవహరిస్తున్నాయి. తమ పార్టీల ప్రధాన లక్ష్యం తెలంగాణా సాధనే అయినా తెలంగాణా పార్టీలు ఒకరితో ఒకరు పొత్తు పెట్టుకోవడం లేదు. అన్ని ప్రతిపక్ష పార్టిలు కోరేది కాంగ్రస్ ఓటమే అయినా అవి కలిసే సూచనలు లేవు. కొత్తగా పుట్టుకొచ్చిన ప్రజారాజ్యం పార్టీ పుట్టె ముంచేటట్టు ఉంది. అభిమాన సంఘాల అండదండలతో, మూడో కుల పార్టీగా ముద్ర వేసుకొని అందలమెక్కాలన్న దానికి రాజకీయాల అనుభవం సున్నా. పైగా అభిమాన సంఘాలు "సూపర్, సూపర్" అని సినిమాలను నూరు రోజులు నడపడానికి పనికొస్తాయేమో గాని, "చిరు" పార్టీని గెలిపించి హీరోని సింహాసనం ఎక్కిస్తాయన్నది ప్రశ్నార్ధకమే! అవినీతిని అంతమొందిస్తామన్న ఆ పార్ట్తీలో అప్పుడే ఇతర పార్టీల లోని అవినితిపరులు చేరిపోతున్నారు. ఈ విధంగా ఆ పార్టీ తను పవర్ లోకి వస్తుందో లేదో కాని ఇతర పార్టీలను ముంచటానికి పనికి రావచ్చు.

పైవన్నీ అధికార పార్టీకి అక్కరకు రావచ్చు. కాని దానికి పాలించే సభ్యుల సంఖ్య రాకపోవచ్చు. తెలంగాణా సమస్య నెత్తికు చుట్టుకొని దాని ఆశలు నిరాశే కావచ్చు. పైగా ఐదేళ్ళ నిర్వాకం ఉండనే ఉంది. ఇందిరా గాంధి, రాజీవు గాంధి బొమ్మలకు ఓట్లు రాలే కాలానికి ఎప్పుడో చెల్లు చీటీ రాసేశారు. సోనియాకు అవసరార్ధం కాంగ్రెసు వాళ్ళు జై కొట్టాలి గాని ప్రజలు చీ కొట్టే పరిస్థితే.

ఇదంతా చూస్తూ ఉంటే, నరకాసుర వధ ఎవరు చేస్తారు, ఎలా జరుగుతుంది అన్నది మంచి రక్తి కట్టే సీనే.