Thursday, June 5, 2008

దేశమా నీ గమ్యం ఎటు?

మన దేశానికి స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలు దాటింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలొ మనం సాధించింది ఏమిటి? మన గమ్యం ఎటు? ఈ ప్రశ్నలు ఎంతో కలవరపాటుని కలిగిస్తాయి.దీనికి కారణం స్వరాజ్యం వచ్చిన మొదటి రోజుల్లో ఉన్న ఉత్సాహం అడుగంటిపోవడం, ప్రజా శ్రేయస్సుకు పాటుపడాలన్న ఇంగితం పాలకులలో పూర్తిగా లోపించడం, దీని స్థానం లో స్వార్ధం, అవినీతి ,ధన దాహం చోటు చేసుకోవడం. ఈనాటి ఈ దుస్తుతికి గురుతర భాద్యత వహించాల్సినది సుదీర్ఘకాలం పరిపాలన సాగించి దేశ రాజకీయాలను వక్రమార్గానికి మళ్ళించిన కాంగ్రస్ పార్టియే. స్వరాజ్యం వచ్చిన మొదటి రోజుల్లో నెహ్రు, పటేల్ వంటి నాయకులు అంకిత భావంతో జాతికి సేవలనందించారు. సంకుచిత రాజకీయాలకు అతీతంగా జాతీయభావంతో ప్రజాక్షేమానికి పాటుపడ్డారు.ప్రజలలో ఎన్నో ఆశలు రేకెత్తించేరు. కాని జరిగిందేమిటి? తరువాతి రోజుల్లో కుత్సిత రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఈనాటి ఈ దుస్తితికి ఆనాడే శంకుస్తాపన జరిగింది. శంకుస్థాపనన చేసిన ప్రాజక్టుల మాట దేవుడెరుగు, ఈ పాజక్టులు మాత్రం అవిచ్చిన్నంగా కొనసాగుతున్నాయి.
పదవినిలబెట్టుకోవడం కోసం ఎమర్జన్సీని కూడా విధించడానికి దుస్స్సాహసం చేసిన ఇందిరా గాంధీ వ్యక్తిపూజ, నియంతృత్వ ధోరణి, అనువంశిక పాలన వంటి జాడ్యాలను జాతిపై రుద్దారు. పైనుండి క్రిందివరకు అవినీతి, బంధుప్రీతి వ్యాపించి పోయాయి."లంచగొడితనం ప్రపంచమంతా ఉంది దానిగురించి పట్టించుకోనవసరం లేదు" అంటూ ఇందిరాగాంధీ శలవిఛ్ఛారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా. అవినీతి అవ్చ్చిన్నంగా "ఇంతింతై వటుడింతై" అన్న చందాన పెరిగి పోయింది. రాజకీయాలకు అవినీతి పర్యాయపదంగా మారిపోయింది. ఎంత విస్తృతంగా వ్యాపించి పోయిందంటే న్యాయాధిపతులు కూడా దీనివ్యాప్తికి తమవంతు సహకారం అందించే కాలం వచ్చేసింది.
రాజకీయ (వి)నాయకులు తమ పబ్బం గడుపుకోవటానికి సమాజాన్ని ఎన్నోరకాలుగ చీల్ల్చేసారు. కులాల పేరుతోటి, మతాలపేరుతోటి ముక్కలు చెక్కలు చేసి విద్వేషాలు పెంచి పోషిస్తున్నారు. విద్య, ఆరోగ్యాలకు నామమాత్రపు నిధులు ఇచ్చి నిరక్షరాస్యతను పెంచి పోషిస్తున్నారు. ఒకడి లేమి రెండో వాడికి కలిమి కదా. ప్రజలు నిరక్షరాస్యులు అఙ్ఞానులుగా ఉంటేనే వీరి ఆటలు సాగుతాయి. దేశనిధులను పరాయి పాలకులకన్నా హేయంగా కొల్లగొట్టుకొని ఈ రాజకీయ రాబందులు స్వైర విహారం చేస్తున్నారు. తమ స్వార్ధ రాజకీయాలకోసం ప్రత్యర్ధులను నిస్సంకోచంగా మట్టుపెట్టటానికి కూడా వెరవడం లేదు.
ఒకప్పుడు ప్రజలు కన్న కలలు ఈనాడు కల్లలుగా మిగిలిపోయాయి. ప్రజల గురించి పట్టించుకొనే నాధుడే కరవయ్యాడు. రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఈ నాయకులు తమ భవిష్యత్తు, తమవారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రజల భవితను అగమ్యగోచరంగా చేసేసారు. దగా, దోపిడీ స్వైరవిహారం చేస్తున్నాయి. మేధకి స్థానం లేదు. హత్యలు చేసే వాళ్ళూ, ఫాక్షనిష్టులు గూండాలూ మన నాయకులు.
ఆలోచిస్తూ ఉంటే ఈ పరిస్తితులు ముందు ముందు ఎక్కడికి దారితీస్తాయో అన్న బాధ కలుగుతుంది. అందుకే అనుకోవలసి వస్తోంది "దేశమా నీ గమ్యం ఎటు?" అని.

- దూర్వాసుల పద్మనాభం

0 వ్యాఖ్యలు: