Saturday, August 2, 2008

తాగితే తప్పేముంది?

"పూటుగా తాగించండి" ఎక్సైజ్‌ శాఖకు సీఎం ఆదేశాలు

"ఇంతేనా.. జనం తాగడం లేదా? ఇంకా తాగించండి’’ ఇవీ ఎక్సైజ్‌ శాఖాధికారులకు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి నుంచి అందిన ఆదేశాలు. దీనికి అధికారులు రెట్టించిన ఉత్సాహంతో... వచ్చేనెల నుంచి మద్యం అమ్మకాలు మరింత ఊపందుకుంటాయని సమాధానమిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మొదటి త్రైమాసికానికి సంబంధించి ఎక్సైజ్‌శాఖకు విధించిన రూ.1031 కోట్ల లక్ష్యంలో రూ. 1170 కోట్లు ఆదాయం లభించి లక్ష్యంలో కన్నా 113 శాతం ఆదాయం పెరిగింది.అయినా ఎక్సైజ్‌ ఆదాయం మరింత పెరగాలని.. వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో సంక్షేమ పథకాల( ఎవరి సంక్షేమం?) అమలుకు కావల్సిన నిధులకు ప్రధానవనరు ఎక్సైజ్‌శాఖేనని తెలిపారు. ఈ శాఖ కష్టపడి పనిచేస్తే వాణిజ్యపన్నుల శాఖ కూడా ఆదాయాన్ని పెంచుకుంటుందన్నారు. జూలై నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చి దుకాణాల లైసెన్స్‌ ఫీజులు పెరిగి మద్యం అమ్మకాల కన్నా రెంటల్స్‌ ఎక్కువ వచ్చాయి. దీన్ని అధికారులు ఎక్సైజ్‌ ఆదాయంగా చూపించారు. ఇది సరి కాదని, మద్యం అమ్మకాల ఆదాయం పెంచాలని ఆయన సూచించారు.
బీరు తప్ప మిగతా బ్రాండ్ల అమ్మకాలు తక్కువగా ఉండటంతో ఆదాయం తగ్గిందని అధికారులు వివరించారు. త్రైమాసిక లక్ష్యం రూ. 5660 కోట్లయితే సాధించింది రూ. 5410 కోట్లు. గత ఏడాది కన్నా 22శాతం పెరిగినా, లక్ష్యంలో 95శాతమే సాధించడంతో ఆదాయమార్గాలను మెరుగుపరచుకోవాలని సూచించారు.
ఇదీ ఏలినవారి నిర్వాకం! పూటుగా మందు పట్టించేసి సంక్షేమ పధకాల గురించి మాట్లాడటానికి సిగ్గూ లజ్జాలేని ప్రభుత్వం.

0 వ్యాఖ్యలు: